ప్రపంచకప్లో మరో సంచలనం చోటు చేసుకుంది. పసికూన అని భావించే బంగ్లా పులల ముందు విండీస్ తలొంచింది. ఈ నెల 2న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్.. నిన్న విండీస్ను చిత్తుగా ఓడించింది. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా …41.3 ఓవర్లలోనే ఉఫ్ మనిపించింది. ఫలితంగా 5 పాయింట్లతో జాబితాలో పైకి ఎగబాకింది. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న విండీస్కు సెమీఫైనల్ ఆశలు సన్నగిల్లాయి.
అసాధారణ ఫామ్లో ఉన్న షకీబ్ అల్ హసన్ (99 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించేదాకా పోరాడాడు. అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన లిటన్ దాస్ (69 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్లు) ఈ గెలుపులో వాటా దక్కించుకున్నాడు. దీంతో విండీస్పై బంగ్లా 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కరేబియన్ ఓపెనర్ క్రిస్గేల్, సిక్సర్ల వీరుడు ఆండ్రూ రస్సెల్ డకౌట్ అయినా టాపార్డర్ పుంజుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 70, షాయ్ హోప్ 96, నికోలస్ పూరన్25, మెట్మెయిర్ 50, జాసన్ హోల్డర్ 33 పరుగులు చేయడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తఫిజుర్ రహ్మాన్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 41.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.
322 పరుగుల విజయ లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించారు. తొలి వికెట్కు 52 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 29 పరుగులు చేసిన ఓపెనర్ సౌమ్య సర్కార్ను రస్సెల్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ చెలరేగిపోయాడు. ఫోర్లతో విరుచుకుపడ్డాడు. షకీబల్ హసన్, లిటన్ దాస్లు క్రీజులో పాతుకుపోయి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. షకీబల్ అజేయంగా 124 పరుగులు చేయగా, లిటన్ దాస్ సెంచరీకి 4 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.