లాక్ డౌన్ తో క్రీడాలోకం నిలిచిపోయింది. క్రికెటర్లంతా ఇంట్లోనే లాక్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. కొందరు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. మరికొందరు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పలు ఫొటోలు షేర్ చేసి.. ఎవరో గుర్తుపట్టారా? అంటూ తమ అభిమానులను అడిగిన విషయం తెలిసిందే.
ఇటీవల టీమిండియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల ఫొటో ట్వీట్ చేసింది. తాజాగా అభిమానులకు ఓ ప్రశ్నను సంధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ‘228’ జెర్సీ నెంబర్నే ఎందుకు వేసుకుంటాడో తెలుసా? అని ప్రశ్నించింది. పాండ్యా పరుగెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ట్వీట్ కు ఫ్యాన్స్ తమ సమాధానాలు ఇచ్చారు. 2009లో విజయ్ మర్చంట్ అండర్ -16 టోర్నీలో భాగంగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో బరోడా తరపున పాండ్యా అదరగొట్టాడు. ఏకంగా 228 పరుగులతో రాణించాడు.
తన కెరీర్లో ఏకైక డబుల్ సెంచరీ ఇది. అందుకే ‘228’ జెర్సీ నెంబర్నే వేసుకుంటున్నాడు అని ఓ ఫ్యాన్ చెప్పాడు. దాదాపుగా ఫ్యాన్స్ అందరు ఇదే చెప్పారు. ఇక గతేడాది సెప్టెంబర్లో వెన్నుగాయంతో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైయ్యాడు. తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కు పాండ్యాను బీసీసీఐ ఎంపిక చేసినా.. కరోనా కారణంగా అది జరగలేదు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్ టీ20 కప్లో రిలయన్స్-1 తరఫున ఆడిన పాండ్యా అద్భుతంగా రాణించాడు.