కూటమి ప్రభుత్వంలో అన్నీ అమరావతికే తరలించుకుపోయే కార్యక్రమం జరుగుతోందని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో MSME టెక్నాలజీ సెంటర్ను కూడా గుంటూరుకు తరలించుకుపోయారు.. వాళ్లకు కావాలంటే ఇంకొకటి తెచ్చుకోవచ్చు అన్నారు. కానీ.. ఉన్నవాటినే రాయలసీమనుంచి అమరావతికి తరలించుకుపోతున్నారు.. గతంలో హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబు ఇదే చేశారు అని మండిపడ్డారు.
ఎప్పుడూ కేంద్రీకరణకే మొగ్గు చూపడం చంద్రబాబుకు అలవాటైన పని.. ఇప్పుడు కూడా అదే చేస్తూ, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అని ఆరోపించారు. అన్ని ఉద్యమాల్లోనూ రాయలసీమను అభివృద్ధి చేయాలి, కర్నూలులో హైకోర్టు పెట్టాలనే డిమాండ్ ఉందన్నారు. బార్ కౌన్సిల్ చాలాకాలంపాటు ఉద్యమం చేస్తే, దానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిందన్నారు.
జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, ఏపీఈఆర్టీ, సీబీఐ కోర్టు వంటివి కర్నూలుకు వచ్చాయన్నారు. దీంతోపాటు లా యూనివర్సిటీకి కూడా అనుమతి తెచ్చుకుని, వంద ఎకరాలు కేటాయించి, వెయ్యికోట్ల నిధులు సమకూర్చింది జగన్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఆ యూనివర్సిటీని కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక తరలించిందన్నారు.
హైకోర్టును కర్నూలులో పెట్టాలని పెద్దమనుషుల తీర్మానం చేసినా సరే అది చెయ్యలేదు.. వెనుకబడిన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టి అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా గతంలో లేదు అన్నారు. వైయస్ఆర్ తర్వాత మళ్లీ జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగింది తప్ప…ఎప్పుడూ అన్యాయమే జరిగిందన్నారు.