యశ్ హీరోగా, గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’. ప్రకటన వెలువడిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ లాంఛ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ తనపై వస్తున్న ట్రోలింగ్పై, సినిమా ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఈవెంట్లో నటి కియారా అడ్వాణీపై యశ్ ప్రశంసలు కురిపించారు. ఆమెను ‘తబాహి’ (ప్రళయం) అని అభివర్ణించారు. ‘‘కియారా.. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావు. ట్రైలర్లో కొంచెం సేపే కనిపించినా, ఆ చిన్న సన్నివేశాల్లోనే నీ కష్టమంతా స్పష్టంగా కనిపిస్తోంది. నీ అంకితభావాన్ని నేను దగ్గర నుంచి చూశాను. ఇంతమంది ప్రముఖ నటీనటులను ఒకే చోటకు చేర్చినప్పుడు సమస్యలు వస్తాయేమోనని మొదట్లో అనుకున్నాం. కానీ, కియారా ఈ ప్రాజెక్ట్లో భాగమైన నాటి నుంచి చాలా వినయంగా ఉంటూ తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. నేను కూడా ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరి మాటలనూ పట్టించుకోకుండా మనం చేయాల్సింది చేస్తూ వెళ్లడమే. ప్రజలు కచ్చితంగా నిన్ను అభినందిస్తారు’’ అని యశ్ పేర్కొన్నారు.
సినిమా కాన్సెప్ట్ గురించి చెబుతూ.. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాత అందరి ఆలోచనల్లోనూ మార్పు వస్తుంది. మేము ఎంత ముందుచూపుతో ఈ సినిమా చేశామో రిలీజ్ తర్వాత అర్థమవుతుంది. ఇది కేవలం యశ్ సినిమా మాత్రమే కాదు.. ఒక భారతీయ సినిమా. నటీనటులందరూ ఎన్నో త్యాగాలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు. మేము దీనిని కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో చిత్రీకరించాం. చాలా మంది నెగెటివ్గా మాట్లాడారు. కానీ, నేను ఎవరి మాటలను వినను. అలా విమర్శించేవారి ఊహాశక్తిలోనే లోపం ఉందని అనుకుంటాను. కష్టపడితే జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదని యశ్ స్పష్టం చేశారు.
‘టాక్సిక్’ సినిమాను ప్రారంభించినప్పుడు చాలా మంది ‘నీ వల్ల కాదు’ అని తనను నిరుత్సాహపరిచారని దర్శకురాలు గీతూ మోహన్దాస్ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తనపై నమ్మకం ఉంచి, ఈ భారీ ప్రాజెక్ట్ను అంగీకరించినందుకు హీరో యశ్కు ఆమె ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. విమర్శలను ఎదుర్కొంటూ భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది.
