నటి కత్రినా కైఫ్ శరీరాకృతిపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ప్రసవానంతరం ఆమె బరువు పెరిగారంటూ కొందరు నెటిజన్లు అనవసరపు చర్చలు నడిపారు. ఈ ట్రోల్స్ను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ వివాదంపై నటి కత్రినా కైఫ్ పరోక్షంగా స్పందించారు. తన దృష్టిలో అసలైన అందం అంటే ఆరోగ్యంగా ఉండడమేనని ఆమె తేల్చిచెప్పారు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో కఠినమైన అందాల కొలతలకు తాను ప్రాధాన్యం ఇచ్చానని కత్రినా తెలిపారు. కాలంతో పాటు అందంపై తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ, మనసును ప్రశాంతంగా ఉంచడమే నిజమైన సౌందర్యమని అన్నారు. పైకి కనిపించే రూపం ముఖ్యం కాదని, మనం ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామనేదే అసలైన అందమని కత్రినా పేర్కొన్నారు.
కత్రినాకు మద్దతుగా నటి ఖుష్బూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు రావడం పూర్తిగా సహజమని చెప్పారు. దానిని అర్థం చేసుకోకుండా హేళన చేయడం సరికాదన్నారు. గతంలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నానని తెలిపారు. మహిళలు తమను తాము ప్రేమించుకోవడమే విమర్శకులకు ఇచ్చే గట్టి సమాధానమని అన్నారు.
మరో నటి సోనారికా భడోరియా కూడా కత్రినాకు మద్దతుగా నిలిచారు. కేవలం కత్రినా మాత్రమే కాకుండా ప్రతి మహిళా ఇలాంటి ట్రోలింగ్ను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనివ్వడం చిన్న విషయం కాదని, ఆ సమయంలో మహిళ శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుందని గుర్తుచేశారు. ప్రసవం తర్వాత కోలుకునేందుకు ప్రతి ఒక్కరికీ సమయం పడుతుందని చెప్పారు.
తల్లి కావడానికి మహిళలు సర్వస్వం త్యాగం చేయాలని కోరుకునే ఈ ప్రపంచం, మాతృత్వం తర్వాత ఆమె శరీరంలో ఎలాంటి మార్పు రాకూడదని ఆశించడం సిగ్గుచేటని సోనారికా మండిపడ్డారు. ఆమె ఎలా కనిపిస్తోంది అనేదానికంటే, ఆమె పడుతున్న కష్టాన్ని గుర్తించాలని హితవు పలికారు. మహిళల శరీరాకృతిపై జరిగే ఇలాంటి అనవసర ట్రోల్స్ను ప్రతి ఒక్కరూ ఖండించాలని సినీ ప్రముఖులు పిలుపునిస్తున్నారు.

