ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. భర్త తనపై దాడి చేసి ముక్కు కొరికాడని ఒకరు ఆరోపిస్తుంటే.. కోడలే తన కుమారుడి ప్రైవేట్ పార్ట్ను కొరికిందని అత్త ప్రత్యారోపణ చేసింది. ఈ విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇరువర్గాల ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైన భర్తను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దోయి జిల్లా సాండీ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంషీగంజ్ ప్రాంతానికి చెందిన సాధన (27)కు పదేళ్ల క్రితం దీపక్తో వివాహం జరిగింది. దీపక్ వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే సుమారు మూడు నెలల క్రితం సాధన మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. ఆ సమయంలో పోలీసుల సమక్షంలో ఇరువర్గాల మధ్య పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది.
అనంతరం సాధన గురువారం తిరిగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ వివాదం మొదలయింది. ఈ గొడవలో తన భర్త దీపక్ తనపై దాడి చేసి ముక్కును కొరికేసి, ఆ భాగాన్ని కాలువలో పడేశాడని భార్య సాధన ఆరోపించింది. ఘటన సమయంలో అత్తమామలు తన చేతులు పట్టుకున్నారని తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత సాండీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు, అక్కడి నుంచి హర్దోయి మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు భర్త దీపక్ తల్లి (అత్త) ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. సాధన తిరిగి వచ్చి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతోనే గొడవ జరిగిందని చెప్పింది. ఈ క్రమంలో కోడలు సాధనే తన కుమారుడి ప్రైవేట్ భాగాన్ని కొరికిందని ఆరోపించింది. అంతేకాకుండా ఆమెకు తానే స్వయంగా గాయపర్చుకున్నట్లు పేర్కొంది. సాండీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పుష్పరాజ్ మాట్లాడుతూ.. భార్యాభర్తల పరస్పర ఫిర్యాదుల ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని, భర్త దీపక్ను విచారిస్తున్నామని వెల్లడించారు.

