హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి రోజు ఏదో విధంగా అక్రమంగా బంగారం తరలించడం, విదేశీ కరెన్సీ, డ్రగ్స్ ఇలా పట్టుబడిపోతున్నాయి. అయితే అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు ఎయిర్పోర్టులో నిఘా పెంచుతున్నారు అధికారులు. తాజాగా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.
జాంబియాకు చెందిన మహిళ దోహా నుంచి నిన్న ఉదయం శంషాబాద్కు వచ్చింది. ఆమె వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆమె నుంచి 8 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీని మొత్తం విలువ రూ. 53 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఇంత భారీగా డ్రగ్స్ తరలించడం ఈ మద్య కాలంలో జరగలేదని.. జాంబియాకు చెందిన నిందితురాలి పేరు ముకుంబా కరోల్ అని తెలిపారు. డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.