తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న అది పుకార్లకే పరిమితమైంది. ఇప్పటివరకు సామాజిక సమీకరణలు కుదరకపోవడం, కీలక నాయకుల వ్యక్తిగత ధోరణులు, పట్టింపులు వల్ల కొలిక్కిరాలేదు. పలుసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలించలేదు.
అయితే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కారం చేస్తూ వస్తుండగా కేబినెట్ విస్తరణ ముహుర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండి అన్ని సామాజిక, రాజకీయ సమీకరణాలను సర్దుబాటు చేస్తున్నారని సమాచారం.
జూన్ 2వ తేదీకి ముందుగా, ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తవుతుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. సామాజిక వర్గాల వారిగా ఒక ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వారికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. మరి కేబినెట్లో ఛాన్స్ దక్కించుకునే ఆ నలుగురు అదృష్ట వంతులు ఎవరా అన్నది తెలియాల్సి ఉంది.