అభివృద్ధి అంటే ఆంధ్ర అన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని చేతుల మీదుగా రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేసుకున్నాం అన్నారు. ఏపీ చరిత్రలో ఇది మిగిలిపోయే రోజు అన్నారు. ప్రధాని ఆశీస్సులతో విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయి అన్నారు.
నగరంలో ఏర్పాటు చేసిన రోడ్ షో అదిరిపోయిందని చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తోందని చంద్రబాబు తెలిపారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం… ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం అన్నారు.
విశాఖ రైల్వే జోన్కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాం అన్నారు. రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశాం. రూ.3,044 కోట్లతో 234 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేశాం. ఇది ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు అన్నారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతాం అన్నారు చంద్రబాబు. ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్, ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలతోపాటు 12 యూనివర్సిటీలు ఏపీకి కేటాయించారు అన్నారు. అమరావతిని త్వరలో పూర్తి చేస్తాం… మోదీ సారథ్యంలోనే పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం అన్నారు.