టీడీపీ ఎంపీ..మైనింగ్ దోపిడి!

ఏడాది పాలనలో హామీల అమలు ఊసే లేదు… లేని స్కామ్‌లను సృష్టించి ప్రభుత్వ అధికారులపైనా కక్షసాధింపులకు పాల్పడుతుందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ వైపు చూడాలంటేనే బ్యూరోక్రాట్స్‌ భయపడుతున్నారన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన అనిల్… వేమిరెడ్డి మైనింగ్ దోపిడీ రూ. 1000 కోట్లు అన్నారు.

లీజు ముగిసిన మైన్స్‌లోనూ అక్ర‌మంగా మైనింగ్ దందా చేస్తున్నారని…సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలు సైతం బేఖాత‌ర్ చేశారన్నారు. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా డీజీ ర్యాంకు అధికారి స‌హా మాజీ ఐఏఎస్‌ల‌ను కూడా వ‌ద‌లకుండా అక్ర‌మ కేసుల‌తో వేధింపులకు గురిచేస్తున దుర్మర్గపు పాలనను చూస్తున్నామని అన్నారు.

వేమిరెడ్డి చేస్తున్న మైనింగ్ మాఫియాపై మాట్లాడితే ఆయన కంపెనీ పెట్టుకోవ‌డం త‌ప్పా అంటూ టీడీపీ నాయ‌కుడు బీదా ర‌విచంద్రయాద‌వ్ వత్తాసుగా మాట్లాడారు. తాను త‌ప్ప ఇంకెవ‌రూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడ‌ద‌న్న ఎంపీ దురాశ కార‌ణంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఎంపీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఫ్యాక్ట‌రీ పెడ‌తాన‌న్నాడు. ఎప్పుడు పెడ‌తాడు. ఎక్క‌డ పెడ‌తాడో చెప్ప‌డం లేదు. ఫ్యాక్ట‌రీకి ఇంకా శంకుస్థాప‌న చేయ‌కుండానే వేల ట‌న్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. చైనాలో ఫ్యాక్ట‌రీ పెడ‌తాడా? ప‌ది వేల ట‌న్నులు ఎక్స‌పోర్ట్ చేస్తే రూ. 5 కోట్లు వ‌స్తుంది అన్నారు.

గ‌త ప్ర‌భుత్వంలో టీడీపీ వారి మీద కూడా ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌కుండా స్వేచ్ఛ‌గా మైనింగ్ చేసుకోనిచ్చాం. ఎవ‌ర్నీ బెదిరించ‌లేదు అన్నారు అనిల్. మైన్స్‌ను బ్లాక్ చేయ‌లేదు. ఎక్స్‌పోర్ట‌ర్ల‌ను ఆప‌లేదు. టాప్ టెన్ ఎక్స్‌పోర్ట‌ర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్ర‌భుత్వ పార‌ద‌ర్శ‌క విధానాల‌కు ఇంత‌క‌న్నా వేరే రుజువులు అవ‌స‌రం లేదు చెప్పుకొచ్చారు.