ఏపీ ప్రభుత్వంతో అంగన్వాడీలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి నుండి అంగన్వాడీలు విధుల్లోకి హాజరు కానున్నారు. అంగన్వాడీలతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 డిమాండ్ల అమలుకు కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి బొత్స తెలిపారు.
ఇక రిఐటర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచింది ప్రభుత్వం. అలాగే పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు,చనిపోయిన వారి కుటుంబాలకు రూ.20 వేల తక్షణ సాయం, ఇక అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన వేతన పెంపు జూలై నుండి అమలు చేసేలా హామీ ఇచ్చింది సర్కార్. అలాగే సమ్మెకాలంలో వేతనాలు, పోలీసు కేసులపై సానుకూలంగా స్పందించింది జగన్ సర్కార్.
రిటైర్ మెంట్ బెనిఫిట్స్ను వర్కర్లకు రూ.50 వేల నుండి రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుండి రూ.60 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు మంత్రి బొత్స. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. భవిష్యత్లో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.అంగన్వాడీలపై సీఎం జగన్కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో నేటి నుండి విధుల్లోకి హాజరవుతామని అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా అమలు చేస్తామని సంతోషంగా ఉందని తెలిపారు. అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు అంగన్వాడీ యూనియన్ నాయకులు.