ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేయడంతో పాటు అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి తెస్తామన్నారు.
మద్యం ధరలు తగ్గిస్తామని… 3 నెలల పాటు విచారణ పూర్తయ్యేంత వరకు 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపేస్తామని తెలిపారు మంత్రి పార్థసారథి. అలాగే పాత పట్టదారు పాస్బుక్ల స్థానంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని చెప్పారు.
అలాగే మావోయిస్టు పార్టీపై నిషేధం మరో ఏడాది పొడిగించామని రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు, అల్పాదాయ వర్గాలకు అందుబాటు ధరలకు నాణ్యమైన లిక్కర్ సరఫరా చేస్తామన్నారు. పట్టాదారు పాస్ బుక్ లపై ప్రభుత్వ ముద్రతో పాటు భూ అక్రమాల వెలికితీతకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
22 ఏకు సంబంధించిన ఫిర్యాదులకు మూడు నెలల్లో పరిష్కారం చూపుతామని అప్పటివరకు 22ఏ భూముల రిజిస్ట్రేషన్ ఆపుదల చేస్తామన్నారు. ఇప్పటికే పూర్తయిన రిజిస్ట్రేషన్లపై విచారణ చేపడతామన్నారు. స్థానిక సంస్థలు, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన మినహాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. నూతన వైద్య కళాశాలల్లో 100 సీట్లతో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం చెప్పింది.
కొత్త వైద్య కళాశాలల్లో అదనంగా 380 పోస్టులకు ఆమోదం చెప్పామన్నారు. సున్నిపెంట పంచాయతీకి ఇచ్చిన 208.74 ఎకరాల భూమిని రద్దు చేశాం అని… ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారన్నారు. శ్రీశైలం దేవస్థానం మాస్టర్ ప్లాన్ కోసం వినియోగించుకుంటాం అన్నారు.