చంద్రబాబు పాలన వస్తేనే దళితులపై దాడులు జరగడం కామన్ అయిపోయిందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేదు అన్నారు.
నగరి మండలం తడుకుపేట దళితులపై దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ సీపీకి ఓటు వేశారని దళితులు ఇళ్లపై దాడి, వాహనాలు ధ్వంసం అమానుషం అన్నారు.కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీ, ఎస్టీలకు రక్షణ లేదన్నారు.
చుండూరు, కారంచేడు ఘటనల్ని తలపించేలా తడుకుపేట ఘటన జరిగిందని భూమన మండిపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యానాదులు పై కూడా ఇదే తరహాలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయన్నారు. తడుకుపేట దళితులు పై దాడి ఘటన పై జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.