తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టి మరి కాంగ్రెస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు సైతం కాంగ్రెస్లో చేరుతుండటం విశేషం.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరగా తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హస్తం గూటికి చేరడానికి రంగం సిద్ధమైంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనమడు , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి…సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ను ఎమ్మెల్సీ చల్లా కోరినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్లో చేరికపై చల్లా మౌనంగానే ఉన్నా రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 9న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు రేవంత్. ఈ సందర్భంగా చల్లా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.