బీజేపీ సైద్దాంతిక విలువలు కలిగిన పార్టీ. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్న దానిని తూచా తప్పకుండా పాటించే పక్కా పొలిటికల్ పార్టీ. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పైసా, పరపతి ఉన్న నేతలకే పదవులు అన్న తీరుగా తయారైంది. ప్రధానిగా మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో కోల్డ్వార్ తారాస్థాయికి చేరింది.
త్వరలో టీబీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లో మాదిరిగానే పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నేతల తీరు ఉంది. అందుకే కనీసం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కూడా చేయలేదు. వన్ మ్యాన్ షోగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యవహరించారనే టాక్ ఆ పార్టీలోనే నడుస్తోంది.
ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే సెబ్జెక్ట్లకు సంబంధించి ముందస్తు చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కనీసం ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తే పార్టీ మైలేజ్ పెరుగుతుందో అన్నదానిపై గైడ్ కూడా చేయలేని పరిస్థితి. కనీసం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సమాచారం కూడా ఉండటం లేదు. ఇటీవల కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతు రుణమాఫీపై హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీనికి ఎమ్మెల్యేలకు సమాచారం కూడా లేదు.
ఇక ముఖ్యనేతలు పార్టీ అధ్యక్ష పదవిపై తప్ప ఎలాంటి కార్యక్రమాలపై దృష్టి సారించడంలేకపోవడం అంతర్గత విభేదాలను బయటపెడుతోందని పలువురు భావిస్తున్నారు. మొత్తంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు , ఇష్టమున్నట్లు వ్యవహరిస్తుండటం మాత్రం బీజేపీలో కొత్త సంస్కృతే మొదలైందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.