ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వాస్తవానికి ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకుంది కూటమి.
ఎన్నికల్లో పోటీ వరకు అంతా కలిసికట్టుగా సాగిన నేతలు అధికారంలోకి రాగానే తమ స్వరాన్ని మార్చారు. ఎవరి గోల వారిదే.. ఎవరి నినాదం వారిదే ఇప్పుడు విశాఖ కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో కనిపిస్తోంది.
అంతేగాదు ఎవరి ప్రెస్ మీట్ వాళ్లేదే. ఎవరి స్టేట్మెంట్లు వాళ్లవే. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీ ప్రకటన వెలువడిన దగ్గరి నుండి నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అప్పటివరకు ఐక్యంగా పని చేసిన నేతలు ఒక్కసారిగా రూట్ మార్చేసి ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎవరికి వారే సంబురాలు చేసుకున్నారు.
టీడీపీ నేతలు రామ్నగర్లోని పార్టీ ఆఫీస్లో సంబురాలు చేసుకుంటే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ నేతలు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణను అడ్డుకుందని ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇలా మొత్తానికి స్టీల్ ప్లాంట్ స్పెషల్ ప్యాకేజీ అంశంతో కూటమిలో లుకలుకలు బయటపడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.