ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ కలకలం రేగింది. ఈ ఘటన సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు, విత్త మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల మంత్రి నడెండ్ల మనోహర్, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ పరిపాలన & పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, హోం మంత్రి వి. అనిత సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తక్షణమే స్పందించిన పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకువచ్చారు. బ్యాటరీ నిల్వ ప్రాంతం నుంచే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు.
ఘటన తరువాత, సచివాలయంలో భద్రతా పరమైన కఠిన నిబంధనలు అమలు చేశారు. గుర్తింపు కార్డులున్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించగా, మీడియాకు అనుమతి నిరాకరించారు.
ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం అని తెలిపారు హోం మంత్రి అనిత. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందిందని.. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అన్నారు. అధికారుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది అన్నారు.