రైతు భరోసా అమలు పై మరోసారి మాట తప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని.. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు అన్నారు.
మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు.. రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయి అన్నారు. మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదు… ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైంది అన్నారు.
రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి..?, దసరాకిస్తమన్నరు, ఇవ్వలేదు.. సంక్రాంతికి ఇస్తమన్నరు, ఇవ్వలేదు, ఉగాదికి ఇస్తామని ఊరించారు. రైతుల్ని ఉసూరుమనిపించారు అని మండిపడ్డారు. కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని మిగుల్చింది ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదు అన్నారు.
మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నడని.. డేట్లు మారుతున్నాయి, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బిఆర్ఎస్ పార్టీ నిన్నూ, నీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని.. ఎక్కడిక్కడ నిలదీస్తూ, మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటుందన్నారు.