బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎడతెరపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కురిసిన వర్షాలకే నగరం తడిసిముద్దవగా శుక్రవారం మధ్యాహ్నం నుండే నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండేలా కనిపిస్తోంది. వర్షాలకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోగా పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి.
శనివారం నాడు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం ,సోమవారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.