మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు!

నాడు రైతు రాజ్యం..నేడు దోపిడీ రాజ్యం అని చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు….చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు…రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది అన్నారు. మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి..చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు అన్నారు.మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు అని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా మరో రూ.20 వేలు ఇస్తామని మాటిచ్చిన చంద్రబాబు.. గతేడాది రైతు భరోసా రూ.20 ఎగ్గొట్టార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

మా ప్రభుత్వంలో రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చాం… ప్రతీ రైతుకు అదనంగా రూ.10 వేలు ఇచ్చేవాళ్లం అన్నారు. పారదర్శకంగా ఉచిత బీమా అందించాం… రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం అని తెలిపారు. మా హయాంలో రైతులకు సువర్ణ యుగం… వ్యవసాయం దండగ అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోంది అన్నారు.పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టేట ముంచుతున్నారు… రైతులను ఆదుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు.

కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా.. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి, టమాటో వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించి, ఆర్బీకేలలో వాటిపై పోస్టర్లు ఏర్పాటు చేసి అక్కడే అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను అక్కడే కూర్చోబెట్టి.. ప్రతి పంటా కూడా ఈ క్రాప్‌ చేసి.. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకపోతే.. అక్కడ సీఎం యాప్‌ అని పెట్టి.. వెంటనే ఆ పంటలకు సంబంధించిన రేట్లు అప్‌ డేట్‌ చేసేవారు. ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాకుండా ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందించేది.