ఏపీలో ఎంబీబీఎస్ సీట్లపై రగడ కొనసాగుతోంది. రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంపై మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అని మండిపడ్డారు జగన్. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు ? అని ప్రశ్నించారు జగన్.
నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అదించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? అన్నారు జగన్.
వైయస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? అన్నారు.
ఇకనైనా కళ్లుతెరవండి చంద్రబాబుగారూ. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తిచేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి. మీకు చేతనైనంత మీరు ఖర్చుచేస్తూ వెళ్లండి. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్కాలేజీల ప్రయివేటుపరం మాటున స్కామ్లు చేయడం మానుకో చంద్రబాబూ! లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాకతప్పదని గుర్తించుకోండని హెచ్చరించారు.