ఏపీలో ఉచిత ఇసుక విధానంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తుందా? అని మండిపడ్డారు జగన్. ఇసుక కొందామంటే వైసీపీ ప్రభుత్వంలో కన్నా రెండింతలు అధికంగా ధర ఉందని చంద్రబాబుకు చురకలు అంటించారు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసి నజగన్ పలు ప్రశ్నలు సంధించారు.
పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి.. గోలపెట్టి.. ప్రజలంతా అటు వెళ్లగానే.. మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు గారి మోడస్ ఆపరండీ కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే చంద్రబాబునే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలో కన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? చెప్పాలన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైసీపీ ప్రభుత్వం స్టాక్యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా? ఆలోచించాలన్నారు.
2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా? ఈ మోడస్ ఆపరండీకి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబు! ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. రెండు నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్నారు.
అదే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసిందని ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు? అని జగన్ నిలదీశారు.