2018-19లో లిక్కర్ ఆదాయం దాదాపు రూ.1600 కోట్లు అయితే 2023-24లో లిక్కర్ ఆదాయం రూ.24,700 కోట్లు వచ్చింది… నిజంగా చంద్రబాబు చెబుతున్నట్లుగా వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగితే ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్.
మీడియాతో మాట్లాడిన మార్గాని.. చంద్రబాబు థీయరీ ప్రకారం పెరిగిన ఆదాయం ప్రభుత్వానికి బదులు బినామీల జేబుల్లోకి వెళ్లి ఉండాలి కదా? 2018-19లో లిక్కర్, బీరు కలిపి 6.6 కోట్ల కేసులు విక్రయిస్తే, వైయస్ఆర్సీపీ హయాంలో 2023-24లో 4.44 కోట్ల లిక్కర్ కేసులు విక్రయించారు. అంటే వైయస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలు తగ్గాయి, ఆదాయం పెరిగింది… కానీ చంద్రబాబు హయాంలో లిక్కర్ సెల్స్ పెరిగాయి, ఆదాయం లేదు అన్నారు.
లిక్కర్ అమ్మకాలు ప్రతి ఏటా పదిశాతం పెరుగుతూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఇదే తంతు కొనసాగుతోంది. కొత్తగా అరవై వేల బెల్ట్ షాప్లు పెట్టారు. పర్మిట్ రూంలు, డోర్ డెలివరీలు కూడా చేస్తున్నారు. అంటే లిక్కర్ అమ్మకాలు మరింత పెంచుతున్నారు. కానీ లిక్కర్ ద్వారా వస్తున్న ఆదాయం మాత్రం పెరగడం లేదు. అంటే ఈ ఆదాయం ఎవరి జేబుల్లోకి పోతోంది? ఇది స్కామ్ కాదా? వీటిని డైవర్ట్ చేసేందుకు కొత్త నాటకానికి చంద్రబాబు తెర తీశారు అన్నారు.
గత ప్రభుత్వంలో సీఎంఓలో పనిచేసిన రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి లపై అక్రమ కేసులు బనాయించి, వారిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో ఆధారాలు లేవంటూ అభ్యంతరాలు తెలియజేసిన సీఐడీ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను పక్కకు తప్పించి, కేంద్ర సర్వీసులకు పంపారు. అలాగే ఇటువంటి తప్పుడు కేసులను అంగీకరించడానికి పలువురు ఐపీఎస్ అధికారులు నిరాకరించడంతో, విజయవాడ సీపీని సిట్ చీఫ్గా నియమించి ఈ అక్రమ కేసులను ముందుకు తీసుకుపోతున్నారు. చంద్రబాబు ఈ అక్రమాలు ఎల్లకాలం చెల్లవనే విషయం గుర్తుంచుకోవాలని మార్గాని భరత్ హెచ్చరించారు
ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.5000 కోట్ల పైచిలుకు లిక్కర్ స్కామ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో బార్ షాప్లకు ప్రివిలైజ్డ్ చార్జీలను పెంచుతున్నామని చెప్పి వారి నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకున్నారు. అలాగే తరువాత వారికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఏడాదికి సుమారు రూ.1300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అదికూడా నూటికి ఎనబై శాతం చంద్రబాబు తన అస్మదీయులకు మేలు జరిగేలా చూశారు. ఇది కదా లిక్కర్ స్కామ్. దీనిపై వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో విచారణ జరిపి కేసు నమోదు చేశారు. ఆనాటి ఎక్సైజ్ మంత్రి, చంద్రబాబును, అప్పటి ఎక్సైజ్ కమిషనర్లపై కేసులు నమోదు చేశారు అన్నారు.