బీజేపీలో బీఆర్ఎస్ విలీనం…కవిత సంచలనం!

మీడియాతో చిట్ చాట్‌గా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టడం కాదు అంటూ కేటీఆర్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ట్విట్టర్‌లో పోస్టులు కాదు నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుంది… ఆడబిడ్డమీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా?, కేసీఆర్‌ను నడిపించేంత పెద్దోళ్లా మీరు అని మండిపడ్డారు.

కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు.. నాపై ప్రతాపం చూపిస్తున్నారు. నేను అసలే మంచిదాన్ని కాదు.. నోరు విప్పితే తట్టుకోలేరు. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్ లో మెసేజ్‍లు సరిపోతాయా?. ..ఇంటి ఆడబిడ్డపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదు అని దుయ్యబట్టారు.

నన్ను రేవంత్ రెడ్డి కోవర్టు అనడం సరైనదేనా?. మా నాన్నకు నేను లేఖ రాస్తే నీకు నొప్పేంట్రా బయ్. అసలు నేను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరు?. జైలుకు వెళ్లిన రోజే పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పా. రాజీనామా అవసరం లేదని చెప్పారు అన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి… లీకు వీరులను పట్టుకోమంటే నాపై దండెత్తారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు అన్నారు.

ముందు ఒకటి.. వెనుక ఒకటి ఉండవు. నేను కేసీఆర్‍లా తిక్కదాన్ని.. ఏమున్నా ఫేస్ టు ఫేస్. ఏమైనా ఉంటే పార్టీ లోపల మాట్లాడాలన్నారు. అసలు మాట్లాడటానికి లోపల ఏముంది?. సోషల్ మీడియా పెట్టుకుని నాపై దాడులు చేస్తే ఎలా?. ఆ తెలివితేటలు ఏవో ప్రత్యర్థి పార్టీలపై చూపండి. బీజేపీతో అంటకాగేందుకు బీఆర్‍ఎస్ ప్రయత్నిస్తోంది అని ఆరోపించారు.