బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతోందని, కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడడానికి పార్టీ పరంగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో నిజాలను ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా కాంగ్రెస్ ప్రభుత్వం సహించడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రకంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా పోటీపడి తిట్లు తిడుతున్నారని, కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవి… ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని అన్నారు. “కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి… కేసీఆర్ ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అన్నారు కవిత.