తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా? పెద్ద ఎత్తున పార్టీలో ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8,బీజేపీ 8, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకోగా కేంద్ర కేబినెట్లో ఇద్దరికి ఛాన్స్ దక్కింది. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ చోటు దక్కించుకున్నారు.
ఇక ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండగా ఆయన స్థానంలో కొత్తవారిని తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ప్రముఖంగా బీసీ నేత ఈటల రాజేందర్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి.
బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఈటలకు అవకాశం ఇస్తారని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈటల సైతం ఇప్పటికే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. త్వరలోనే కేంద్రమంత్రి అమిత్ షాను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీకి కొత్త బాస్ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.