వైసీపీపై కక్షతోనే లిక్కర్ స్కాం కుట్రకు తెరలేపారని మండిపడ్డారు వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మనోహర్ రెడ్డి.. లిక్కర్ స్కాం పేరుతో కూటమి ప్రభుత్వమే ఒక భారీ కుట్రకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, సోషల్ మీడియా యాక్టివీస్ట్లను తప్పుడు కేసులు బనాయించి వేధించిందని మండిపడ్డారు.
సాధారణంగా ఏదైనా భారీ అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత అంశాలపై ఆడిట్ రిపోర్ట్ లను పరిశీలిస్తారు. విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి లేఖ రాస్తే, దానిపై తొమ్మిది రోజుల్లో నివేదిక తెప్పించుకుని, తక్షణం సీఐడీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం అర్థం కావడం లేదన్నారు.
రెండు రోజుల్లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తేనే దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు నడిపిస్తున్న నాటకం అర్థమవుతుందని.. అంతేకాదు సీఐడీ ఏకంగా అయిదుగురు అధికారులతో ఈ కేసుపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది అన్నారు. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వీరవిధేయులుగా ఉన్న ఆఫీసర్లను ఏరికోరీ మరీ ఈ సిట్లో నియమించారు. సిట్ను నియమించే సందర్బంలో సుప్రీకంకోర్ట్ సూచించిన ఏ మార్గదర్శకాలను కూడా పాటించలేదు అన్నారు.
లిక్కర్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ముద్దాయిల కాలమ్లో ఎవరి పేర్లు లేకపోయినప్పటికీ వైయస్ఆర్సీపీ ఎంపీ మిధున్రెడ్డి పేరు ఉన్నట్లు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తున్నారు అని దుయ్యబట్టారు. ఎల్లో మీడియాలో దీనిపై బుదరచల్లేలా ప్రముఖంగా వార్తలు రాయించారు. దర్యాప్తునకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ, తాము ఎవరినైతే ఈ కేసులో ఇరికించాలని భావిస్తున్నారో వారిపై తప్పుడు కథనాలను రాయిస్తూ, ఆ తరువాత వారిని ముద్దాయిలుగా చూపే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు.