ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండా కేవలం వైసీపీనే టార్గెట్గా జరుగుతున్నాయి. ఇక ఇవాళ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, పుంగనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ స్వీకరణకు ముందు అసెంబ్లీలో పెద్ద హైడ్రామా నడిచింది.
పీఏసీ చైర్మన్ నామినేషన్ దాఖలు కోసం గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉంది. నామినేషన్ పత్రాలతో వైఎస్సార్సీపీ నేతలు 11గం.కే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరారు. అయితే అధికారులు లేకపోవడంతో సుమారు 2 గంటలపాటు అధికారుల రాక కోసం వాళ్లంతా పడిగాపులు కాశారు. ఈ పరిణామంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయం పెట్టి కూడా నామినేషన్ తీసుకోరా? ఇంత సేపు ఎమ్మెల్యేలను ఎదురు చూసేలా చేస్తారా? అంటూ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్పై మండిపడ్డారు. ఇక చివరి నిమిషంలో టీడీపీ నుండి నామినేషన్ దాఖలు చేశారు 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు. ఈ 12 మంది సభ్యుల్లో ఒకరిని చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉండగా టీడీపీ తీరును వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.