కరోనా వైరస్ కారణంగా అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఐపీఎల్ కూడా ఉంది. ఈనెల 15వ తేది వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్ డౌన్ ఉండటంతో 15 నుంచి ఐపీఎల్ టోర్నీ జరగడం అనేది కష్టంగా మారింది.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ కంటే ప్రాణాలే ముఖ్యమని భారత వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. కరోనాలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రజా భద్రతకే ప్రాముఖ్యమివ్వాలని వ్యాఖ్యానించాడు. ఇక ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. టోర్నీ కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని రైనా అన్నారు.
ఇంకోవైపు కరోనా కట్టడికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని అన్నారు. లేకుంటే చాలా పెద్ద ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. పరిస్థితులు మెరుగు పడితే అప్పుడు ఐపీఎల్ గురించి ఆలోచించవచ్చని అన్నారు. ఇక సురేశ్ రైనా 52 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.