హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ11గా ఉన్నారు బన్నీ. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్. దాదాపు రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది? , సంధ్య థియేటర్కు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా? , పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా?.. తెలియదా? , సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా? అని అడిగినట్లు తెలుస్తోంది.
అలాగే సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా?, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?, తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు? ,ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు? , సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు? , తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా? , రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం.