ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం, పేరంపల్లి గ్రామంలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడిని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా మహిళల భద్రతపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. గుర్రంకొండలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇది తెలిసిన ప్రేమోన్మాది గణేష్ యువతిపై కత్తితో దాడి చేయడమే కాదు ముఖంపై యాసిడ్ పోసి రాక్షసానందం పొందాడు.