కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మీడియాతో మాట్లాడిన షర్మిల.. కడప ఉక్కు.. చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీలా మారిందని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న టీడీపీ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయలేదన్నారు.
కేవలం శంకు స్థాపనల పేరుతో హడావిడి చేస్తున్నారని చంద్రబాబు తీరును తప్పుబట్టారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి ఉండేదని తెలిపారు. ఏపీ పట్ల బీజేపీ చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు.
పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైయస్సార్ చిత్తశుద్దితో తీసుకొచ్చిందే కడప స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పారు. 10వేల ఎకరాల్లో 20వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల కెపాసిటీతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలన్నది వైయస్సార్ ఆశయం కానీ దానిని ప్రస్తుత ప్రభుత్వం నీరు గారుస్తోందని ఆరోపించారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడం ద్వారా 25వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. బీజేపీ నాయకులు 2014కు ముందు అనేక హామీలు ఇచ్చారని.. కానీ, ఒక్క హామీ కూడా నెరవేర్చలేక పోయారని విమర్శించారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చురకలు అంటించారు.