ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖమంత్రి హెచ్.డి.కుమారస్వామిని కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని వినతిపత్రం అందజేసింది వైసీపీ ఎంపీల బృందం.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించి క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది, తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి తెలిపారు వైసీపీ ఎంపీలు. విశాఖ ఉక్కు టర్న్ అరౌండ్ సాధించడానికి అవసరమైన చేయూత కేంద్రం అందించాలని వినతిపత్రంలో కోరిన ఎంపీలు, మరో రెండేళ్ళపాటు కేంద్రం నుంచి చేయూత అందితే ఆర్థిక పరిస్ధితి మెరుగువుతుందన్నారు.
ఇన్పుట్ ఖర్చులను తగ్గించడానికి వీలుగా ఆర్ఐఎన్ఎల్ కు క్యాప్టివ్ మైన్లను కేటాయించడం ద్వారా వ్యయప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడుతుందని, కేంద్రం సహకారం అందిస్తే ప్లాంట్ మళ్ళీ లాభదాయకమైన వెంచర్గా మారుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు ఎంపీలు.
ఆర్థిక పునర్నిర్మాణానికి కేంద్రం సాయపడాలని విజ్ఞప్తి చేయగా తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని వైసీపీ ఎంపీల బృందం తెలిపింది.
కుమారస్వామిని కలిసిన వారిలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వి.విజయసాయిరెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మద్దిల గురుమూర్తి, మేడా రఘునాధ్ రెడ్డి, గుమ్మ తనూజా రాణి ఉన్నారు.