కరెంట్ ఛార్జీల పెంపుపై సమరశంఖం పూరించింది వైసీపీ. ఇవాళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట పట్టగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
విద్యుత్ చార్జీల బాదుడిపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ర్యాలీ జరిగింది. కాకినాడలో కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా,పెద్దాపురంలో దవులూరి దొరబాబు పాల్గొన్నారు. కర్నూల్ జిల్లాలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అనంతపురం జిల్లాలో విద్యుత్ కార్యాలయాల వద్ద వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అనంతపురం నగరంలోని బ్రహ్మంగారి ఆలయం నుంచి పవర్ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. శింగనమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివారెడ్డి,
ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.
వైయస్ఆర్సీపీ విద్యుత్ పోరుబాట నేపథ్యంలో రెచ్చగొట్టేలా టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్కు వైయస్ఆర్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు మునిసిపల్ అధికారులు.