నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. బాలయ్య తనయుడి సినిమా ఎంట్రీ గురించి రోజుకో వార్త వస్తుండగా తాజాగా తానే స్వయంగా అనౌన్స్ చేసేశారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991 సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’. బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని అనౌన్స్ చేశారు బాలయ్యబాబు. డిసెంబర్ 6, 2024న ప్రసారం కానున్న అన్స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్ను అనౌన్స్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ సీక్వెల్ అఫీషియల్ గా వర్క్ లో ఉందని చెప్పేశారు.
ఆదిత్య 999 మ్యాక్స్లో నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్ లో నటించనున్నారు అని చెప్పేశారు బాలయ్య. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని తెలిపారు. ఆహాలో ప్రసారమవుతున్న ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ ఆదిత్య 369 అవతార్లో కనిపించారు. సీక్వెల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడంతో పాటు ఆదిత్య 999 మ్యాక్స్ మేకింగ్ సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ అందించనున్నారు. ఈ ఎపిసోడ్కు నవీన్ పోలిశెట్టి, శ్రీలీల గెస్ట్లుగా వచ్చిన సంగతి తెలిసిందే.