తన రాజకీయ జీవితంలో ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశంలో మాట్లాడిన బొత్స…కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైసీపీతోనే ఉన్నారని అన్నారు.
వైసీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు…. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం అన్నారు. వైసీపీతోనే ఉన్న వారందరినీ అభినందిస్తున్నాను అని ప్రశంసలు గుప్పించారు బొత్స.
కశ్మీర్లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం అని…. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.