ఏపీ సీఎం చంద్రబాబు రేపు 14న తలపెట్టిన మంత్రి వర్గ భేటీపై ఉత్కంఠ వీడింది. కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది. మంగళవారం మంత్రివర్గం నిర్వహణకు సీఈసీ షరతులతో కూడిన అనుమతిచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. కేబినెట్లో అంశాలకు అంగీకారం చెప్పిన ఈసీ.. పెండింగ్ చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను పరిశీలించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఆమోదముద్ర వేసింది. స్క్రీనింగ్ కమిటీ అమోదించిన అజెండా నోట్ను ఈనెల 10 తేదీ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వారా సీఈసీకి పంపారు. ప్రతిపాదనను పరిశీలించిన ఈసీ క్యాబినెట్ నిర్వహించుకోవచ్చని ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు ఉదయం ముఖ్యశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. మంచినీరు, సాగునీరు, ఫొని తుఫాను, కరువు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.అంతేకాకుండా కేబినెట్ నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
