ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి రావడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏసీబీ కేసులపై తెలంగాణ సీఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించిన సమయంలో ఓటుకు నోటు కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసును కూడ సీబీఐతో విచారణ చేయాలని మత్తయ్య డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు స్టీఫెన్సన్తో పాటు చాలా మందిని కొనుగోలు చేసి ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరికి టీడీపీ నాయకులు ఫోన్ చేశారన్న విషయాన్ని బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగిన ఎమ్మెల్యేలందరి ఫోన్ కాల్స్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి, తనను ఏ4గా చేర్చారని మండిపడ్డారు. జిమ్మిబాబును తప్పించి తన పేరును తెరపైకి తీసుకొచ్చారని అన్నారు.
స్ట్రింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోలను ఎందుకు మీడియాకు లీక్ చేశారని మత్తయ్య ప్రశ్నించారు. తన సోదరుడి బంధువులపై కూడ దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తన పేరును ఉద్దేశ్యపూర్వకంగా ఏ 4 చేర్చారని మత్తయ్య చెప్పారు
తనను కోవర్టుగా మారాలని బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఓ మంత్రి గన్మెన్ తనను కోవర్టుగా మారాలని బెదిరింపులకు దిగాడని మత్తయ్య ఆరోపించాడు. క్రిస్టియన్ నామినేటేడ్ ఎమ్మెల్యేను ఈ కేసులో బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు.