ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతున్న కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లిగడ్డ. కర్ణాటక హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో అక్కడ కిలో ఉల్లి రూ.1 ధర పలుకుతోంది. వారం కింద రూ.500 పలికిన క్వింటాల్ ఉల్లి రూ.100కు పడిపోయింది.
తమిళనాడు మార్కెట్కు ఎగుమతులు జరగాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని, అప్పటివరకు ఏమి చేయలేమని హుబ్లి వ్యాపారి ఒకరు వాపోయారు. మార్కెట్కు తరలించిన పంటను తిరిగి వెనక్కి తీసుకుపోలేక చాలామంది రైతులు కిలో ఉల్లిని రూ.1కే అమ్ముకుంటున్నారని ఆయన చెప్పారు.
ఉల్లి ఎక్కువగా పండించే బెల్గాం, బిజాపూర్, బాగల్కోట్, ధార్వాడ్, హవేరీ, గడగ్, దేవనగరె, చిత్రదుర్గ జిల్లాల్లో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి హోల్సేల్ దుకాణాలకు భారీ సంఖ్యలో ఉల్లి చేరుకోవడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.
ఇటీవల తమిళనాడును ‘గజ’ తుఫాన్ వణికించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ఉల్లి ఎగుమతి నిలిచిపోయింది. దీంతో తమిళనాడుకు వెళ్లాల్సిన సరకు నిలిచిపోవడం ఉల్లిగడ్డ ధర తగ్గడానికి ప్రధాన కారణం. పంట ధరలు ఎప్పుడు పెరిగినా.. అదేదో సునామి తరహాలో మీడియా దానికి కవరేజ్ ఇస్తుంది. అలా ధరలు పెరగడం ఎప్పుడో ఐదేళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. కానీ విచారించాల్సిన విషయమేంటంటే.. ఇలా అమాంతం ధరలు పడిపోయినప్పుడు మాత్రం ఏ మీడియా, ప్రభుత్వమూ పెద్దగా పట్టించుకోదని రైతులు వాపోతున్నారు.