తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇలా ఆరు జిల్లాల్లో 350 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు సిరులు కురిపిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థ గతేడాది 2017–18లో రూ. 22,667 కోట్ల టర్నోవర్తో కనక వర్షం కురిపించింది. టర్నోవర్, లాభాలు, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అంశాల్లో గణనీయ వృద్ధి సాధించి పాత రికార్డులను అధిగమించి రికార్డు సృష్టించింది.
సింగరేణి సంస్థ 2017–18లో రికార్డు స్థాయిలో రూ.1,200 కోట్ల లాభాలు ఆర్జించి కొత్త పుంతలు తొక్కుతోంది. 2016–17లో సాధించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది సాధించిన లాభాలు 203 శాతం అధికం.
టర్నోవర్: 2016–17: రూ.17,743 కోట్ల టర్నోవర్
2017–18: రూ.22,667 కోట్ల టర్నోవర్
27.8 శాతం వృద్ధి నమోదు చేసింది
బొగ్గు రవాణా: 2016–17లో 608 లక్షల టన్నుల బొగ్గు రవాణా
2017–18: 646 లక్షల టన్నులు
6.2 శాతం వృద్ధి నమోదు
నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటూ రానున్న 5 ఏళ్లలో సుమారు రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి ప్రణాళికను అమలు చేయనున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. సంస్థ రికార్డు స్థాయిలో ప్రగతి సాధించడంలో కార్మికులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. దేశంలోనే సింగరేణి ప్రత్యేకత చాటుతోంది. సింగరేణి లాభాలతో కార్మికులకు కలిసొస్తుంది. గతేడాది దీపావళి బోనస్ భారీగా ఇచ్చారు. లాభాలను కార్మికులకు పంచిపెట్టారు.