ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే తేలిపోయింది. పోలింగ్కు ముందు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా జగన్ సీఎం అవుతారని జోష్యం చెప్పారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కేసీఆర్ ఎలాంటి కామెంట్ చేయకుండా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారు. మౌనం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు సమాచారం.
కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కేంద్రంలో ఏపార్టీకి మెజారిటీ రాదని పలు ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రముఖం కానున్నాయని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేంద్రంలో చక్కం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు జగన్తోనె మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్, వైసీపీ పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య ఓ అవగాహన ఉందని… అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీలు ముందుకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేయబోయే కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని తన వ్యూహాన్ని అమలు పరచనున్నట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికలతో పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలోని పలు ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించే ప్రాంతీయ పార్టీల అధినేతలను జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించి… అక్కడి నుంచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడంపై కేసీఆర్ వ్యూహారచన చేసినట్టు సమాచారం.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్ల పనుల్లో ముమ్మరంగా ఉన్న కేసీఆర్ పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించనున్న కేసీఆర్… వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం వేదికపైనే ఫెడరల్ ఫ్రంట్ బలనిరూపణ చేయాలనే యోచనలో ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇచ్చే విధంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కూడా బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.