పెళ్లి కావడం లేదు అంటే కొందరు తమ లోపాలు చూసుకోరు.. కానీ వెంటనే పూజలు, వ్రతాలు చేయడమో లేదా స్వామిజీలను ఆశ్రయిస్తూ వాళ్లు చేయమని చెప్పినవి గుడ్డిగా చేస్తుంటారు. అలాగే ఓ యువకుడు మాంత్రికుడు దగ్గరకు తనకు పెళ్లి కావడం లేదని వెళ్తే మాంత్రికుడు చెప్పినట్టు చేశాడు. పెళ్లి కాకపోగా అతడి ప్రాణానికే ముప్పు ఏర్పడిన పరిస్థితి.
తనకు పెళ్లి కావడం లేదు.. తరచూ అనారోగ్యానికి గురవుతున్నా. ఎవరైనా చేతబడి చేశారా? అని ఓ మాంత్రికుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ ద్వివేది (42) సంప్రదించాడు. కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురవడంతో పెళ్లి కూడా కావడం లేదు. దీంతో ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. తాను చెప్పినట్లు వినాలని ద్వివేది వద్ద మాంత్రికుడు అంగీకారం తీసుకున్నాడు. తనను ఫాలో అయితే.. పెళ్లి అవుతుంది. అనారోగ్య సమస్యలకు దూరమైపోతాయని ద్వివేదిని మాంత్రికుడు నమ్మించాడు.
ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, దాని బ్యాటరీలు, పదునైన తీగలు, గ్లాసులతో పాటు మరికొన్ని వస్తువులను తినాలని ద్వివేదికి మాంత్రికుడు సూచించాడు. మాంత్రికుడిని నమ్మిన ద్వివేది చాలా వస్తువులన్నీ తినేశాడు. ఈ దెబ్బకు ఆ యువకుడికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా ఇతడి కడుపు పరిశీలించిన వైద్యులు షాక్కు గురయ్యారు. ద్వివేదికి ఎక్స్రే తీయగా పదుల సంఖ్యలో ఇనుప ముక్కలు కనిపించాయి. ఆ తర్వాత బాధితుడికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న ఇనుప ముక్కలను తొలగించారు.