ఓటుకు నోటు కేసు…గురించి తెలియని వారుండరు. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. అప్పట్లో రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. అయితే తాజాగా కేసీఆర్ ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని మరో కొత్త కోణం బయట పెట్టారు. ఇదే ఇప్పుడు హాట్ టాఫిక్గా మారింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటుకు నోటు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి, డబ్బులు ఎరవేయడం – ఏసీబీ అధికారులు బయట పెట్టిన ఒక వీడియోలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఈకేసు వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు ఉన్న ‘ఫోన్ కాల్ రికార్డు’ బయట పడటంతో చంద్రబాబు నాయుడు కూడా చిక్కుల్లో పడ్డారు. ఆతర్వాత జరిగిన పరిణామాలాతో చంద్రబాబు ఇక్కడ జెండా పీకి అమరావతిలో నాటాడు.
రెడ్ హ్యాండెడ్గా దొరికిన బాబు టీ ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా మోదీ ఆపారన్నారు. ఎందుకంటే అప్పట్లో భాజాపాతో టీడీపీ దోస్తీ చేస్తుండటమే అందుకు కారణం. బాబు అరెస్ట్ కాకుండా ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తీసుకొచ్చారు. మహబూబ్ నగర్లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఓటుకు నోటు కేసులో మోదీనీ లాగారు.
ఓటుకు నోటు కేసులో ప్రధాని మోదీ హస్తం కూడా ఉందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే చంద్రబాబుతో చేతులు కలిపి నరేంద్ర మోదీ ఈ కుట్ర పన్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని అప్పట్లో వారు ప్రణాళికలు రచించారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడే కేసీఆర్ ఎందుకు ఈ విషయాన్ని బయటకు తెవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.