సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో పార్లమెంట్ లో సీన్ రివర్స్ అయ్యింది. టీడీపీ చరిత్రలో మొదటి సారి పార్లమెంట్ లో పార్టీ ఆఫీసు దక్కకుండా పోయింది. వివిధ రాజకీయ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. పార్టీ సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 15 పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గదులు కేటాయించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గ్రౌండ్ ఫ్లోర్లో 2, 3, 4 నంబరు గదులను కేటాయించారు. కాంగ్రెస్ పార్టీకి 24, 25 నంబర్ గదులు దక్కాయి. 23 ఎంపీ సీట్లను గెలుపొందిన డీఎంకేకు 46వ నంబర్ గది, తృణమూల్ కాంగ్రెస్కు 20-బి రూమ్ను కేటాయించారు.ఇక వైసీపీకీ రూమ్ నెంబర్ 5ను కేటాయించారు. విచిత్రం ఏంటంటే2014-19 మధ్య ఈ రూమ్ను టీడీపీకి కేటాయించారు. ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఆఫీసులను కేటాయించారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీలకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసులను కేటాయించారు.
దీంతో టీడీపీ చరిత్రలో తొలిసారి పార్లమెంటరీ పార్టీ ఆఫీసు దక్కకుండా పోయింది. టీడీపీ నుంచి గెలిచింది ముగ్గురు మాత్రమే కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీకి ఇద్దరు మాత్రమే రాజ్యసభ సభ్యులున్నారు.అదే సమయంలో వైసీపీ తరఫున 22 మంది లోక్సభ సభ్యులు గెలిచారు.
