తెలుగు రాష్ట్రాల్లో భాజాపా బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తన ప్రణాలికలను పక్కాగా అములు చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీలో ఉన్న బలమైన నాయకులను పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇప్పటికే నలుగురు ఎంపీలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఎవరైనా పార్టీలోకి రావచ్చంటూ గేట్లు తెరిచింది. తాజాగా జనాకర్షణ కలిగిన సినీనటులపై దృష్టిసారించింది.
తెలుగుదేశం పార్టీ బలాన్ని తమవైపుకు తిప్పుకునేందుకు కార్యచరణ అమలు చేస్తోంది. అలాగే వివిధ సామాజిక వర్గాల్లో మంచి పట్టున్న నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు చాపకింద నీరులా తమ ప్రణాలికలను అమలు చేస్తోంది. తాజాగా బలమైన కాపు సామాజికి వర్గానికి చెందిన కేంద్రమాజీమంత్రి మెగాస్టార్ చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ వ్యూ గాలం వేస్తోంది. తన రాజ్యసభ్యత్వం ముగియడంతో అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి సారించారు.
ఇప్పుడు మాత్రం చిరును మళ్లీ రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు భాజాపా పావులు కదుపుతోంది. చిరు తమ పార్టీలో చేరితే.. ఆయన్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం. రాంమాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ సహా కొందరు బీజేపీ నేతలు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని కాషాయ పార్టీ అంచనా వేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికే సిద్ధపడని చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లో చేరతారనేది అనుమానమే. అదీగాకుండా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న తరుణంలో చిరంజీవి భాజాపా ఆఫర్కు సై అంటారా లేకా నై అంటారో వేచి చూడాల్సిందే.