వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అన్నారు. పరోక్షంగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పని చేస్తాయన్న సంకేతాలిచ్చారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో కీలక ప్రసంగం చేశారు. ప్రభుత్వ విధానాలను దుమ్మెత్తిన పోసిన జనసేనాని..వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఎవరూ సంతోషంగా లేరన్నారు. జగన్ పాలనే కూల్చివేతలతో మొదలైందన్నారు. ఇసుక విధానంతో లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో చీకటి నింపారని నిప్పులు చెరిగారు.
సీఎంలు మారినప్పుడు విధానాలు మారకూడదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రైతులు భూములు ఇచ్చారనీ.. రాజు మారిన ప్రతిసారీ రాజధాని మారకూడదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించారనీ… అప్పుడు ఈ వైసీపీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అప్పుడేమైనా గాడిదల కాశారా? అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా..? అని నిలదీశారు. ఇప్పుడు వైసీపీ నాయకులు మూడు రాజధానుల గురించి మాట్లాడుతున్నారన్నారు. తాను ఈ రోజు చెబుతున్నాననీ.. అమరావతి రాజధాని ఇక్కడ నుంచి ఎక్కడికీ మారదన్నారు.
తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని పవన్ స్పష్టం చేశారు. అప్పుల్లేని రాష్ట్రంగా ఏపీని చేయాలన్నదే జనసేన లక్ష్యమని అన్నారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు.విశాఖ, విజయవాడను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దడంతో పాటు అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని అన్నారు. ఉద్యోగుల సీపీఎస్ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
-Anjanreddy Kodathala