విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగలనుంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుగు దేశానికి గుడ్బై చెప్పి ఫ్యాన్ గూటికి చేరనున్నారు. మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని సంచలన ప్రకట చేశారు కన్నబాబు . టీడీపీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని… కానీ, తనను పార్టీ చిన్న చూపు చూసిందని అన్నారు. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే తనను నమ్మించి, మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు లోకేష్ కూడా తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించానని తెలిపారు. తన నిర్ణయంలో మార్పు ఉండదని, భగవంతుడు చెప్పినా తాను వినబోనని చెప్పారు. గత ఎన్నికల్లో ఎలమంచిలిలో టీడీపీ గెలుపునకు కీలక పాత్ర పోషించారు. ఎలమంచిలి, పాయకరావుపేటలో వైసీపీ గెలుపే లక్ష్యంగా తాను పని చేస్తానని కన్నబాబు వెల్లడించారు.
కాంగ్రెస్ హయాంలో కన్నబాబు ఎలమంచిలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. మంత్రి కొణతాల హయాంలో చక్రం తిప్పారు. ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా కాకపోయినా, ఎమ్మెల్సీగా అయినా చంద్రబాబు అవకాశం ఇస్తారని ఆశించినా ఫలితం దక్కలేదు.
ఆయన ప్రాతినిథ్యం వహించిన ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి కూడా అవకావం రావడం కష్టమని భావించి ఆయన కూడా ప్రత్యామ్నాయం చూసుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం కన్నబాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.