ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. మోదీ నివాసంలో ఇరవై నిమిషాలకు పైగా ఈ భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ సాగింది. విభజన చట్టం హామీలతో పాటు రక్షణశాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే విషయం, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, హైకోర్టు విభజనతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ప్రధానితో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి మరోసారి సీఎం ప్రస్తావించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించినట్లు సమాచారం. రక్షణ శాఖ భూములు రాష్ర్టానికి బదలాయించాలని కోరినట్లు తెలుస్తుంది. రాష్ర్టానికి ఐఐఐటీ, ఐఐఎం మంజూరుతో పాటు కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై మోదీతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ సందర్భంగా రాజకీయ పరమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. డిసెంబర్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్ణయించే అంశంపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.