టీడీపీపై వైసీపీ విమర్శల జోరు పెంచింది. తాజాగా ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదాపై సీఎం చంద్రబాబు రంగులు మార్చడంలో ఊసరవెళ్లిని మించిపోయారి విమర్శించారు. అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రాత్రికి రాత్రే ప్రెస్మీట్ పెట్టి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో కూడా అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబు తన నీడను తానే నమ్మలేరని… ఇంకా చెప్పాలంటే కన్న కొడుకు నారా లోకేష్ ను కూడా ఆయన నమ్మడం లేదని చెప్పారు.
చంద్రబాబులాంటి వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టమని విజయసాయి అన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతోందని చెప్పారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని, ప్రధాని అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెబుతున్నారని… రంగులు మార్చే నైజం చంద్రబాబుది కాబట్టే మోదీ ఆయనను విశ్వసించలేదని అన్నారు.