Thursday, April 25, 2024
- Advertisement -

వైసీపీపై పగ.. టీడీపీపై ప్రేమ.. కన్నా విమర్శల ’’విలువ’’ ఎంత?

- Advertisement -

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన కోవిడ్ కిట్స్ అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ప్రశంసించారు. అయినా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చూశాక.. ఆయన ఖచ్చితంగా ‘పచ్చ’పార్టీకి అమ్ముడుపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఇదే మాట అనడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా లక్షలు వెచ్చించి దక్షిణ కొరియా నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక ‘కోవిడ్ కిట్స్’పై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు టీడీపీ పచ్చబ్యాచ్ ఆరోపణలకు దగ్గరగా ఉండడం అందరిలోనూ అనుమానాలకు తావిస్తోంది.

ఇదే కోవిడ్ కిట్స్ కర్ణాటకతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా దక్షిణ కొరియా నుంచి తెప్పించుకుంది. ఈ రెండింటి కంటే ఏపీ ప్రభుత్వం పెట్టిన ధర తక్కువ. అయితే అవి నిర్ధారణకు 30 నిమిషాలు పడితే.. జగన్ సర్కార్ 10 నిమిషాల్లోనే పర్ ఫెక్ట్ గా తేలే అత్యాధునిక కిట్లను ధర భారీగా అయినా కొని ఏపీలో టెస్టులు చేస్తోంది. జగన్ సర్కార్ ఇలా అత్యాధునిక కిట్స్ తెచ్చి టెస్టులు చేస్తూ కరోనాను అరికడుతున్నందుకు కేంద్రం నుంచే కాదు.. చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ఏపీ ప్రభుత్వ చొరవను ప్రశంసించడం విశేషం. బీజేపీ పెద్దలే ఇంతలా జగన్ సర్కార్ చొరవను ప్రశంసిస్తుంటే.. అదే పార్టీకి చెందిన ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా మాత్రం ఎందుకు విమర్శిస్తున్నాడన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బండారాన్ని తాజాగా విజయసాయిరెడ్డి బయటపెట్టారు. టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడు పోయాడని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అందుకే టీడీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని జగన్ సర్కార్ ను విమర్శిస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశారు. ‘‘టీడీపీ ప్యాకేజీ ఎంతలా ఉంటుందంటే.. రాజకీయంగా అవసాన దశలో ఉన్న వారినీ కూడా లేపి కూర్చోబెడుతుందని.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలని’’ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. కన్నా లక్ష్మీనారాయణ సుజనాకు, టీడీపీకి అమ్ముడుపోయారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. మిగతా బీజేపీ వారు ఎందుకు విమర్శించడం లేదో అర్థం చేసుకోవాలన్నారు..

ఇక విజయసాయిరెడ్డి టీడీపీ పచ్చ బ్యాచ్ ను సైతం తాజాగా ట్విట్టర్ లో కడిగిపారేశారు. ‘శవాల మీద పేలాలు ఏరుకునే పచ్చ మాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్లపైన ఏడుపు మొదలు పెట్టింది. ఛత్తీస్ గడ్ రూ. 337 కు కొంటే మీరు 700 దాకా ఎలా పెడతారని. అవి దేశంలోనే తయరైనవి. రిజల్ట్ కు 30 నిమిషాలు పడుతుంది. సిఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాలు చూపుతాయి.’’ అంటూ జగన్ ప్రభుత్వం కరోనా కిట్లపై వస్తున్న విమర్శలకు తెరదించారు. బహుషా సుజనా పంపే ట్వీట్స్ నే కన్నా లక్ష్మీనారాయణ పెడుతున్నాడు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ విమర్శలను వైసీపీ , ఎంపీ విజయసాయిరెడ్డి ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు. ఇంతటి క్లిష్ట కరోనా టైంలో ప్రభుత్వానికి సపోర్టుగా నిలవాల్సింది పోయి టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ బండారం బయటపెట్టడానికే వైసీపీ బ్యాచ్ రెడీ అయినట్లు కనిపిస్తోంది. మరి ముందు ముందు ఈ వివాదం ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -